మానవత్వం పరిమళించిన మంచి మనిషి, కలం యోధుడు, వీఈఆర్ ఆగ్రోఫార్స్మ్ వెబ్ సైట్ వ్యవస్థాపక సంపాదకుడు కీర్తిశేషుడు యెన్నా శ్రీనివాసరావు రెండో వర్ధంతి కార్యక్రమం జూన్ 2 శుక్రవారం జరిగింది. వైఎస్సార్ అని జర్నలిస్టు లోకం మర్యాదగా పిలుచుకునే యెన్నా శ్రీనివాసరావు శివైక్యం పొంది రెండేళ్లు పూర్తయింది.
ముందుగా కీర్తిశేషుడు వైఎస్సార్ చిత్రపటం వద్ద జర్నలిస్టు మిత్రులు, ఆయన ఆత్మీయులు పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. ఆశ్రమంలోని వృద్ధులకు సీనియర్ జర్నలిస్టులు, ఆత్మీయులు ఒక్కొక్కరికీ స్వయంగా పండ్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం భోజనం కూడా వైఎస్సార్ ఆత్మీయ మిత్రులైన జర్నలిస్టులు ఒక్కొరి వద్దకు తీసుకెళ్లి అందజేశారు. వైఎస్సార్ స్మృత్యర్థం నిర్వహించిన ఈ కార్యక్రమం ఆయన ఆత్మీయుడు వర్రే గంగాధర్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగింది. వృద్ధులకు ఆహారం అందించడంతో పాటు ఆశ్రమం నిర్వాహకుల కోరిక మేరకు నిత్యం వంట చేసేందుకు కొత్త గిన్నెలు, బకెట్లు, గరిటెలు కొని వైఎస్సార్ జ్ఞాపకార్థం అందజేశారు. వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన కుమార్తె, ఆమె తల్లి పాల్గొన్నారు.

