ఆహార సంక్షోభం మానవాళికి పెనుముప్పుగా మారనుందా? ప్రపంచ జనాభా ఏటేటా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండడం, ఆహార పంటల దిటుబడి నానాటికీ తగ్గిపోతుండడం దీనికి కారణం కానుందా? అంటే.. అవుననే జవాబు ఆహార రంగ నిపుణుల నుంచి వస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో పెరుగుతున్న జనాభా అవసరానికి చాలినంత ఆహారం దొరకని సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఆహారం కొరత కొన్నేళ్లుగా తాండవం చేస్తోంది. ఆహారం సంక్షోభానికి గ్లోబల్ వార్మింగ్ సహా అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయని ఆహార రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి వనరులను మానవాళి వాడుకుంటున్న తీరు మారకపోతే ఉపద్రవం మరింత ఉధృతంగా ఉండొచ్చని వారు అంటున్నారు. మరో పాతికేళ్లలో ఆహారధాన్యాల కరువు వచ్చే ప్రమాదం ఉందని ఆహారరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాతావరణ మార్పుల ప్రభావం పంటల దిగుబడిపైన పడుతోంది. దీంతో ఆహార భద్రతకు సవాల్అవుతోంది. చివరికి తిండి గింజల కోసం ప్రజలు పాట్లు పడాల్సిన పరిస్థితిరావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో ఆకలి చావులు అంతగా లేవు కానీ పోషకఆహార లోపం సమస్య ఉంది. మరో పదేళ్లకు గోధుమలు, మొక్కజొన్న వంటి పంటల దిగుబడులు తగ్గవచ్చని ఓ అంచనా. వాతావరణ మార్పులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పోషకాహార లోపం మరింత పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణుల హెచ్చరిక. మన దేశంలో వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో చాలా మంది రైతులు తమ పంట భూములను వృథాగా వదిలిపెట్టి పట్టణాలు, నగరాలకు పొట్ట చేతపట్టుకొని వలస వెళ్లిపోతున్నారు. ఇది కూడా ఆహార భద్రతకు ప్రమాదం వచ్చేందుకు అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎస్. అబ్దుల్ ఖాలిక్ అనుమతితో…

